CM KCR పాలమూరు పబ్లిక్‌ మీటింగ్‌లో రేవంత్‌ రెడ్డిపై ఫైర్...

by Disha Web Desk 2 |
CM KCR పాలమూరు పబ్లిక్‌ మీటింగ్‌లో రేవంత్‌ రెడ్డిపై ఫైర్...
X

దిశ, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూలు జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రం ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలు గుర్తుచేసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని తెలిపారు. వలసల జిల్లాకు ఐదు మెడికల్ కాలేజీలు వస్తాయని ఎవరమైనా ఊహించామా? అని అడిగారు. ఆ రంగం.. ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ దేశంలో నెంబర్ వన్‌‌గా ఉందని అన్నారు. గతంలో పాలమూరు జిల్లా ప్రజలు తనపై ఆదరణ చూపించి ఎంపీగా గెలిపించారని గుర్తుచేసుకున్నారు. గతంలో తనకంటే బలంగా ఉన్న, ఎత్తుగా ఉన్న సీఎంలు, మంత్రులు పాలమూరు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు.

60 ఏళ్లుగా ఉపాధి లేక, పంటలు పండక వలసపోయిన ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు.. ఈ తొమ్మిదేళ్లలో ఎంతోమంది వాపస్ వచ్చారని తెలిపారు. పాలమూరు ఎంతో అభివృద్ధి చెందిందని, బీడుబారిన నేలలు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూములు ధరలు భారీగా పెరిగాయని అన్నారు. ఇలాంటి పాలమూరునే తాను కోరుకున్నానని వెల్లడించారు. ధరణి వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. ఓ కాంగ్రెస్‌ ప్రబుద్ధుడు తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామంటున్నాడని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సెటైర్లు వేశారు. ధరణి లేకపోతే అకౌంట్లలో డబ్బులు పడవని తెలిపారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి ధరణి పోర్టల్‌ను ఎత్తివేయడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

ధరణి లేని కాలంలో లంచం ఇవ్వకపోతే పనికాకపోయేదని, కానీ, రైతులకు ఇప్పుడు ఆ పరిస్థితి, బాధలు లేవని అన్నారు. ధరణితో రాష్ట్రంలో 99శాతం రైతుల భూ సమస్యలు పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి.. నేటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని తెలిపారు. ధరణిని కాదు.. కాంగ్రెస్ నేతలను బంగాళా ఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. ఒక వేళ ధరణిని ఎత్తేస్తే రాజ్యమేలేది దళారులే అని సూచించారు. చేతి వృత్తిదారులకు, బీసీ కులాలకు ప్రభుత్వం అందజేసే రూ.1 లక్ష సాయాన్ని జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అతి త్వరలో పూర్తి చేస్తామని కీలక ప్రకటన చేశారు. మీరే నా బలగం.. నా బంధువులు అని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు అయ్యారు.

Also Read..

‘టాస్క్​ తెలంగాణ’ టీ- కాంగ్రెస్ నయా స్కెచ్ ఇదే!

‘తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్.. పునాదులు మావే’

Next Story

Most Viewed